హైదరాబాద్, ఆగస్టు 6 (చైతన్య గళం): తెలంగాణ ప్రభుత్వం కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త తెల్ల రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అదే రోజు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.ప్రభుత్వం సుమారు 1.05 కోట్ల అర్హులైన నిరుపేద కుటుంబాలకు కొత్త తెల్ల రేషన్ కార్డులు అందించనున్నట్లు తెలిపింది. పేదల ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది.రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
