వేములవాడ, ఆగస్టు 25 (చైతన్య గళం): వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన తిప్పాపురం గోశాలలో ఐదు కోడెలు మృతి చెందడం కలకలం రేపింది. గోశాలలో సామర్థ్యానికి మించి కోడెలు ఉండటంతో నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. అపరిశుభ్రత, ఈగలు, దోమల సమస్యతో పాటు కోడెలకు అందుతున్న వైద్య సేవలు కూడా పరిమితంగా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి కోడెల మృతిపై విశ్వహిందూ పరిషత్ గోరక్ష విభాగం గోశాల సంపర్క ప్రముఖ్ వూట్కూరి రాధాకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అధికారుల అలసత్వం కారణంగానే వరుసగా ఐదు కోడెలు మృతి చెందాయని ఆయన ఆరోపించారు. ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని, భక్తుల మనోభావాలతో ఆటలాడవద్దని హెచ్చరించారు. గోశాల నిర్వహణలో తగిన మార్పులు తీసుకురాకపోతే దేవాలయం ఎదుట ధర్నా చేపడతామని స్పష్టం చేశారు గోశాల నిర్వహణపై ఆలయ అధికారులు మరింత శ్రద్ధ వహించి, కోడెలకు మెరుగైన సంరక్షణ, పరిశుభ్రమైన వాతావరణం, నిరంతర వైద్య సేవలు అందించాలని గోరక్ష విభాగం మండల ప్రముఖ్ రేగురి లక్ష్మణ్, సహ ప్రముఖులు కావాల్ల మహేష్, మచ్చ వెంకటేష్ ఆలయ ఈఓ రమాదేవిని కోరారు.
