మర్రిగూడ, జూలై 13 (చైతన్యగళం): మర్రిగూడ మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో మహిళా సంఘాల బలోపేతానికి, వారి కార్యకలాపాలు మరింత ముమ్మరంగా సాగేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ (వివో) భవనానికి సోమవారం శంకుస్థాపన జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఎంపీడీవో మున్నయ్య పాల్గొని శంకుస్థాపన చేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక, సామాజిక రంగాల్లో ఎదగడానికి వివో భవనాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఇకపై గ్రామ మహిళా సంఘాల సమావేశాలు, పొదుపు–వ్యాపార లావాదేవీలు, ప్రభుత్వ పథకాల అవగాహన సదస్సులు ఈ భవనం వేదికగా సజావుగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, వారికి అన్ని రకాల వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ, పంచాయతీ కార్యదర్శి నజీరా, వెన్నమనేని సుధాకర్ రావు, మాజీ సర్పంచ్ లపంగి మల్లయ్య, లపంగి అనంతం, వార్డు సభ్యులు లపంగి మహేందర్, వల్లపు హైమ భాస్కర్, సీసీ భారతి, విబికే వెన్నమనేని చంద్రకళ, నాగిళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
