కరీంనగర్, ఆగస్టు 28 (చైతన్యగళం):
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ రెండో దశలో భాగంగా నోటీసుల పంపిణీ, పరిష్కార ప్రక్రియపై కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్, ఎన్నికల నమోదు అధికారి ప్రఫుల్ దేశాయ్ సమీక్ష నిర్వహించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో బీఎల్ఓ సూపర్వైజర్లు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు నోటీసుల పంపిణీని రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్ణీత తేదీల్లో అవసరమైన ధ్రువపత్రాలతో హాజరయ్యేలా అవగాహన కల్పించాలని సూచించారు. నోటీసుల పరిష్కారం కోసం కళాభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విచారణ కౌంటర్ల వద్ద షెడ్యూల్ ప్రకారం విధులు నిర్వహించాలని అధికారులకు తెలిపారు ఓటర్లు సమర్పించే ధ్రువపత్రాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, విచారణలో పారదర్శకత పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని కమిషనర్ సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల మార్పులు, చిరునామా మార్పు కోసం ఫారం-6, ఫారం-8 దరఖాస్తులను బీఎల్ఓలు స్వీకరించి నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సమావేశంలో తహసీల్దార్లు, బీఎల్ఓ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
