కరీంనగర్, ఆగస్టు 28 (చైతన్యగళం):
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్, ఎన్నికల నమోదు అధికారి ప్రఫుల్ దేశాయ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నోటీసులు అందుకున్న ఓటర్లకు సంబంధించిన పరిష్కార ప్రక్రియపై చర్చించారు ఎస్ఐఆర్ ప్రక్రియలో నోటీసులు జారీ అయిన ఓటర్లు నిర్ణీత గడువులోగా సరైన గుర్తింపు ధ్రువపత్రాలు సమర్పించి తమ వివరాలను సరిచేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కమిషనర్ కోరారు. నోటీసుల పంపిణీ, విచారణ తేదీలు, అవసరమైన ధ్రువపత్రాలు, కళాభారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లు, సహాయ కేంద్రం, పత్రాల పరిశీలన తదితర ఏర్పాట్లను వివరించారు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమకు ఎదురవుతున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురాగా, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. నిర్ణయించిన తేదీల్లో ఓటర్లు హాజరై ధ్రువపత్రాలు సమర్పించేలా పార్టీ ప్రతినిధులు అవగాహన కల్పించాలని సూచించారు విచారణ తేదీల్లో హాజరుకాలేని వారు సెప్టెంబర్ 22లోగా కళాభారతి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను సంప్రదించి ధ్రువపత్రాలు సమర్పించుకోవచ్చని తెలిపారు. అవసరమైన ధ్రువపత్రాలు గడువులోగా సమర్పించకపోతే ఓటు తొలగించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఎలాంటి కారణం లేకుండా ఓటరును తొలగించబోమని, తొలగించిన వారికి కారణాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు ఓటరు వివరాల్లో మార్పులు, చిరునామా మార్పు కోసం ఫారం-8, కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు ఫారం-6 దరఖాస్తులను సంబంధిత బీఎల్ఓలకు అందజేయవచ్చని కమిషనర్ తెలిపారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
