సిద్దిపేట, జూలై 6 (చైతన్యగళం ):
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం సిద్దిపేట ఐడీఓసీలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ కె. హైమావతితో కలిసి జిల్లాలోని జర్నలిస్టులకు మీడియా అక్రిడిటేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జర్నలిస్టులకు ప్రాధాన్యం కల్పించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులు నెట్వర్క్ ఆసుపత్రుల్లో సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లోని లోపాలను నిర్మాణాత్మకంగా ఎత్తిచూపాలని మీడియాను కోరారు.

మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టు లక్ష్మారెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
