కరీంనగర్, జూలై 17 (చైతన్యగళం): కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు సాధారణ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో హౌసింగ్ బోర్డు కాలనీలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు యువకులను గుర్తించి విచారించారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో చట్టపరమైన విధానాన్ని అనుసరించి పరీక్షలు నిర్వహించగా, వారు ఇటీవల గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయింది.
విచారణలో గొనే చక్రి రెడ్డి (20, మారుతీనగర్, కరీంనగర్) మరియు షేక్ తాజ్ బాబా (19, షాషామహల్, కరీంనగర్) గంజాయి సేవించే అలవాటు ఉన్నట్లు వెల్లడించారు. గతంలో గోవా వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా గంజాయి సేకరించి సేవించినట్లు వారు ఒప్పుకున్నారు. అయితే వారి వద్ద ఎటువంటి మత్తు పదార్థాలు లేదా వినియోగ సామగ్రి లభించలేదు.
తదనంతరం నిందితులను గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, మత్తు పదార్థాల వ్యసనం నుంచి విముక్తి పొందేందుకు వారిని డీ-అడిక్షన్ పునరావాస కేంద్రంలో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఇద్దరినీ పునరావాస కేంద్రానికి తరలించారు.
మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, వాటికి దూరంగా ఉండాలని కరీంనగర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
