కరీంనగర్, ఆగస్టు 4(చైతన్యగళం): కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ఐపీఎస్ ఆదేశాల మేరకు కరీంనగర్-III టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుట్టిరాజారాం కాలనీలో సోమవారం కార్డన్ అండ్ సెర్చ్తో పాటు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కరీంనగర్-III టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి. తిరుమల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (లా అండ్ ఆర్డర్) వెంకటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, II టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పుల్లయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సంజీవ్, నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్ రఫీఖ్ ఖాన్, డాగ్ స్క్వాడ్ బృందం, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కార్డన్ అండ్ సెర్చ్లో భాగంగా కాలనీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టగా, డాగ్ స్క్వాడ్ సహాయంతో అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో 61 ద్విచక్ర వాహనాలు, ఒక త్రిచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని, వాటిపై తదుపరి చట్టపరమైన చర్యల కోసం పరిశీలన ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో సుమారు 250 మంది స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత కోసం ఉమెన్ సేఫ్టీ వింగ్ అందిస్తున్న సేవలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, రాహ్-వీర్ పథకం, కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణ వల్ల కలిగే ప్రయోజనాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు.
అలాగే శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
కార్యక్రమం ముగింపులో పోలీసులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు కలిసి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.
