నల్గొండ, జూలై 17 (చైతన్యగళం): జిల్లా పోలీసు శాఖ రాత్రి నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. నైట్ బీట్ సిబ్బందికి రిఫ్లెక్టివ్ జాకెట్లు, ఎల్ఈడీ లాఠీలు, ఫైబర్ లాఠీలు అందజేసి, రాత్రి గస్తీని సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఈ భద్రతా పరికరాలను పంపిణీ చేస్తూ, “దొంగతనాలు, గొలుసు దొంగతనాలు, వాహనాల దొంగతనాలు, ఇతర నేరాలను నివారించడానికి రాత్రి గస్తీని ముమ్మరం చేయాలి. ప్రమాదకర ప్రాంతాలు, నివాస కాలనీలు, హైవేలు, ఏటీఎంలు, బ్యాంకులు, నగల దుకాణాలు వంటి సున్నితమైన ప్రదేశాల్లో పహారా ఉండాలి” అని అధికారులను ఆదేశించారు.అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను వెంటనే తనిఖీ చేయాలని, మహిళలు, వృద్ధులు, ఆపదలో ఉన్నవారికి తక్షణ సహాయం అందించాలని ఆయన సూచించారు. ప్రజలకు అనుకూలమైన పోలీసింగ్ ద్వారా భద్రతను మెరుగుపరచడం, పోలీసింగ్ను ఆధునికీకరించడం, ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.
