టీజీఈసెట్–2026 స్పాట్ అడ్మిషన్లు జూలై 17న
ఏఐ, ఈసీఈ, ఐటీ కోర్సుల్లో ప్రవేశాలు – డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులకు సువర్ణావకాశం
హుస్నాబాద్, జూలై 15 (చైతన్యగళం):
ఇంజినీరింగ్ చదవాలనే లక్ష్యంతో ఉన్న డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులకు శుభవార్త. హుస్నాబాద్లోని శాతవాహన విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో టీజీఈసెట్–2026 కింద బీటెక్ ద్వితీయ సంవత్సరం (లేటరల్ ఎంట్రీ)లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి జూలై 17న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వంటి భవిష్యత్ అవకాశాలు ఉన్న కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
టీజీఈసెట్–2026లో అర్హత సాధించిన డిప్లొమా, బీఎస్సీ (గణితం) అభ్యర్థులు స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావచ్చని తెలిపారు. ఒకవేళ సీట్లు మిగిలి ఉంటే, టీజీఈసెట్లో అర్హత సాధించని అర్హులైన డిప్లొమా, బీఎస్సీ (గణితం) అభ్యర్థులకు కూడా టీజీఈసెట్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
జూలై 16న దరఖాస్తులు స్వీకరించనుండగా, జూలై 17, 2026 ఉదయం 10 గంటలకు హుస్నాబాద్లోని శాతవాహన విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో నిర్ణీత తేదీన కళాశాలకు హాజరుకావాలని సూచించారు.
మరిన్ని వివరాలకు 6305199550ను సంప్రదించవచ్చు.
