ఎలిగేడు, జూలై 15 (చైతన్యగళం): ఎలిగేడు మండలంలోని సుల్తానాపూర్ గ్రామ జడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, ఆస్తుల సంరక్షణ, క్రమశిక్షణ బలోపేతం లక్ష్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎంఈవో నరేంద్రచారి తెలిపారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కవ్వంపల్లి బాపయ్య, ఉపసర్పంచ్ తానిపర్తి రమేశ్ రావు, గ్రామస్థులు ప్రత్యేక చొరవ తీసుకుని సహకరించారు. “సీసీ కెమెరాల ఏర్పాటుతో విద్యార్థుల భద్రత, పాఠశాల పరిసరాలపై నిరంతర పర్యవేక్షణ సాధ్యమవుతుంది. తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరుగుతుంది” అని ఎంఈవో పేర్కొన్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు విద్యాభివృద్ధి పట్ల చూపుతున్న నిబద్ధత, సేవాభావం, దూరదృష్టి అభినందనీయమని ఆయన అన్నారు. “సురక్షిత పాఠశాల – నాణ్యమైన విద్య” లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
