సిద్ధిపేట,జూలై 02(చైతన్యగళం):
ఇటీవల చేర్యాల మండలంలోని శ్రీ సాయి శివ ఫెర్టిలైజర్ సేల్స్ షాప్లో యూరియా సరఫరాలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన వెంటనే జిల్లా వ్యవసాయ అధికారితో విచారణ చేపట్టించామని తెలిపారు. ప్రాథమిక విచారణలో షాప్ యజమాని సందీప్ రెడ్డి ఈ-పాస్ మిషన్ ద్వారా హోల్సేల్ డీలర్ల నుంచి 6,429 యూరియా బ్యాగులు తీసుకుని, వాటిని కన్ఫర్మేషన్ చేయకుండా రైతుల ఆధార్ వివరాలను ఉపయోగించి వారి పేర్లపై అక్రమంగా విక్రయించినట్లు నమోదు చేసినట్టు వెల్లడైందన్నారు. దీంతో వెంటనే పోలీసు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేయగా, అతని ఎరువుల విక్రయ లైసెన్స్ను కూడా వ్యవసాయ శాఖ రద్దు చేసిందని తెలిపారు.
అలాగే సిద్దిపేట అర్బన్ మండలంలోని శ్రీ ఆంజనేయ ఫెర్టిలైజర్స్, శ్రీ గణేష్ ట్రేడర్స్ హోల్సేల్ డీలర్ల నుంచి యూరియా సరఫరా జరిగినట్లు విచారణలో తేలిందని, ఈ వ్యవహారంలో వారి ప్రమేయం ఉన్నట్లు గుర్తించడంతో ఆ రెండు సంస్థల లైసెన్స్లను కూడా వ్యవసాయ శాఖ డైరెక్టర్ రద్దు చేసినట్లు చెప్పారు.
చేర్యాల మండలంలో యూరియా డైవర్షన్, అక్రమాలను సమర్థవంతంగా పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహించిన మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర్ స్వామిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై కూడా విచారణ కొనసాగుతోందని, బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
యూరియా కేంద్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందిస్తున్న ఎరువని, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం యూరియా అక్రమ సరఫరా, డైవర్షన్కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గత రబీ సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన యూరియా యాప్ ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా యూరియా పంపిణీ జరిగిందన్నారు. రబీ పంటకాలం పూర్తికావడంతో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్ను తాత్కాలికంగా నిలిపివేయడంతో యూరియా విక్రయాలు కూడా నిలిచిపోయాయని తెలిపారు.
అయితే చేర్యాల పట్టణంలోని శ్రీ సాయి శివ ఫర్టిలైజర్స్ వారు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ-పాస్ పరికరాన్ని దుర్వినియోగం చేసి రైతుల పేర్లను అక్రమంగా నమోదు చేస్తూ యూరియా అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడించారు. ఈ-పాస్ వ్యవస్థ ఎప్పుడూ నిలిపివేయబడదనే అంశాన్ని అవకాశంగా తీసుకుని ఈ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
యూరియా యాప్ను ఉపయోగించడం ద్వారా యూరియా డైవర్షన్ను పూర్తిగా నియంత్రించే అవకాశం ఉంటుందని, అందువల్ల జిల్లాలోని అన్ని ఎరువుల విక్రేతలు తప్పనిసరిగా యూరియా యాప్ ద్వారానే యూరియా విక్రయాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. యూరియా యాప్ను పక్కనబెట్టి ఇతర విధానాల్లో విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, ప్రతి డీలర్ ప్రభుత్వం నిర్దేశించిన విధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
