యాచారం, జూలై 2 (చైతన్యగళం): సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని, డ్రగ్స్ వలన కలిగే నష్టాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలని హైద్రాబాద్ గ్రీన్ ఫార్మా పోలీస్ స్టేషన్ సీఐ సత్యనారాయణ పిలుపునిచ్చారు.యాచారం మండలం కుర్ముద్ద ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నివారణ, సైబర్ భద్రత, స్మార్ట్ఫోన్ సద్వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ, “డ్రగ్స్ వాడకం విద్యార్థుల ఆరోగ్యం, చదువు, కుటుంబం, భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికి వెళ్లవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి” అని సూచించారు.స్మార్ట్ఫోన్ను వినోదం కోసం అధికంగా వినియోగించకుండా, విద్యాపరమైన అవసరాలకే ఉపయోగించాలని, సోషల్ మీడియా వేదికల్లో అపరిచితులతో స్నేహాలు చేయడం వల్ల మోసాలు, సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు.విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని, సమాజానికి ఆదర్శప్రాయమైన పౌరులుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, మధ్యం సేవించి వాహనం నడపకూడదని సూచిస్తూ ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగియాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్తు పాండురంగారెడ్డి, ఉపాధ్యాయులు రాణి, వీరమణి, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి – సీఐ సత్యనారాయణ
RELATED ARTICLES
