- డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన కలెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్
కరీంనగర్, జూన్ 24 (చైతన్యగళం): వర్షాకాలం నేపథ్యంలో నగరంలో రోడ్లపై వరద నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కలిసి రాంనగర్, రేకుర్తి, మంచిర్యాల చౌరస్తా, కలెక్టరేట్ సమీపంలోని ప్రధాన డ్రైనేజీ వ్యవస్థ నాలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వర్షాకాలంలో వరద నీరు రోడ్లపైకి రాకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
డ్రైనేజీలు, నాలాల్లో వర్షపు నీరు నిరంతరాయంగా ప్రవహించేలా తక్షణ చర్యలు చేపట్టాలని, ఎక్కడా మురుగు లేదా వర్షపు నీరు నిల్వ కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
నగరంలోని కీలక జంక్షన్ల వద్ద నీరు నిల్వ కాకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాల్సిన అవసరంపై కలెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ చర్చించారు.
