కరీంనగర్, జూలై 14 (చైతన్య గళం):
చిన్న వయస్సులోనే తెలుగు, ఆంగ్ల భాషల్లో ద్విభాషా పాటలు, కవితలు రచించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జవహర్ నవోదయ విద్యాలయం, చొప్పదండి విద్యార్థి వర్షిత్ సనమల్లను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అభినందించారు.
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్కు చెందిన వర్షిత్ తన సాహిత్య ప్రతిభతో వరల్డ్వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే సృజనాత్మక రచనలతో విశేష ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు.
తెలుగు, ఆంగ్ల భాషల్లో పాటలు, కవితలు రచించిన ప్రతిభకు గుర్తింపుగా 2026 జూన్ 4న వరల్డ్వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ప్రశంసా పత్రం అందుకోవడం వర్షిత్ సాధించిన అరుదైన విజయమని కలెక్టర్ పేర్కొన్నారు. “ఇలాంటి విజయాలు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తాయి” అని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా వర్షిత్కు ప్రశంసా పత్రాన్ని అందజేసి, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జవహర్ నవోదయ విద్యాలయం ప్రిన్సిపాల్ బ్రహ్మానంద రెడ్డి, వర్షిత్ తల్లిదండ్రులు ప్రేమ్ కుమార్, సుమలత తదితరులు పాల్గొన్నారు.
