మహబూబాబాద్(చైతన్యగళం): బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు పేర్కొన్నారు. వంగవీటి మోహనరంగా 79వ జయంతి సందర్భంగా శనివారం శ్రీరాం నగర్ బీసీ కాలనీలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని రంగ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా పేదలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ప్రజానాయకుడని కొనియాడారు. ప్రజల సమస్యలను ధైర్యంగా ప్రశ్నించిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారన్నారు.
1947 జూలై 4న జన్మించిన రంగా తన రాజకీయ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశారని తెలిపారు. 1985లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేశారన్నారు. ప్రజల హక్కుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో జరిగిన దాడిలో ఆయన హత్యకు గురికావడం రాష్ట్ర రాజకీయ చరిత్రలో విషాదకర ఘటనగా పేర్కొన్నారు.
రంగా భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేష అభిమానాన్ని సంపాదించుకున్న వంగవీటి మోహనరంగా జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాలను కోరారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు వేల్పుల లక్ష్మణ్ పటేల్, వేల్పుల శోభన్ బాబు పటేల్, బీజేవైఎం జిల్లా జనరల్ సెక్రటరీ వీరమళ్ల ప్రేమ్ రాయుడు పటేల్, కోరే ప్రసాద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
