- 30 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం పనిచేసిన నేత.. మంత్రి అయితే అచ్చంపేట అభివృద్ధికి మరింత ఊతం
- సీఎం రేవంత్రెడ్డి చొరవ తీసుకోవాలి: ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతల రాజగోపాల్
అచ్చంపేట, సెప్టెంబర్ 4 (చైతన్యగళం): అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని అచ్చంపేట ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతల రాజగోపాల్ కోరారు. శుక్రవారం అచ్చంపేట పట్టణ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణకు మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని అన్నారు.
డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని రాజగోపాల్ తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ ‘నేనున్నాననే’ భరోసా కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు, అరెస్టులు ఎదురైనా వంశీకృష్ణ వెనుకడుగు వేయలేదని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడారని పేర్కొన్నారు.
అచ్చంపేట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఎమ్మెల్యే వంశీకృష్ణకు మంత్రి పదవి కట్టబెట్టి అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయాలని ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతల రాజగోపాల్ కోరారు.
