- నందికొట్కూరులో ఘనంగా గురుపూజోత్సవాలు.. సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు
- పాడిపంటలు, ప్రజల సుఖశాంతుల కోసం భక్తుల ప్రార్థనలు
నందికొట్కూరు, జూలై 29 (చైతన్య గళం):
ఆషాఢ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా కూడా పిలుస్తారని, గురువును దైవస్వరూపంగా భావించి పూజించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు.
నందికొట్కూరు పట్టణంతో పాటు సాయిబాబాపేట, బొల్లవరం గ్రామాల్లోని ప్రసిద్ధ శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాల్లో గురుపూజోత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయిబాబాకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించడంతో పాటు భజనలు, భక్తి కార్యక్రమాలు చేపట్టారు.
పాడిపంటలు, సుఖశాంతుల కోసం ప్రత్యేక పూజలు
గురుపౌర్ణమి సందర్భంగా నియోజకవర్గంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు
గురుపౌర్ణమి సందర్భంగా పలువురు భక్తులు సూర్యోదయం వేళ ఉపవాస దీక్షలను ప్రారంభించి, చంద్రోదయం అనంతరం ఉపవాసాన్ని విరమించారు. ఉదయం నుంచి ఆలయాల్లో సాయిబాబా నామస్మరణ, భజనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు కొనసాగాయి.
పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఉత్సవాలు
సాయంత్రం ఆలయాల నుంచి నిర్వహించిన ప్రత్యేక ఉత్సవాలు పురవీధుల్లో భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తజన సందోహం మధ్య సాయిబాబా ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. ఆలయ పరిసరాలు సాయినామస్మరణతో మార్మోగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
