సిద్దిపేట, ఆగస్టు 24 (చైతన్యగళం):
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల నమోదు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు గైర్హాజరు, వలస, మరణించిన ఓటర్ల జాబితాలను బూత్ స్థాయి అధికారులు, పర్యవేక్షకుల సమక్షంలో చదివి వినిపించాలని సూచించారు. సభల్లో ఫారం-6, 7, 8లను అందుబాటులో ఉంచి, ఓటర్ల నుంచి వచ్చే అభ్యంతరాలను నమోదు చేయాలని ఆదేశించారు. అసమానతలు ఉన్న, మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న నోటీసుల జారీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కే. హైమావతి మాట్లాడుతూ జిల్లాలో అసమానతలు ఉన్న, మ్యాపింగ్ కాని ఓటర్లకు సంబంధించిన నోటీసుల జారీ ప్రక్రియ దాదాపు పూర్తయిందని తెలిపారు. కార్యాచరణ ప్రకారం ఈ నెల 27న గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదనపు సహాయ ఎన్నికల నమోదు అధికారుల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. సమావేశంలో గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
