కరీంనగర్, ఆగస్టు 25 (చైతన్య గళం):
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నియంత్రణ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వసతి గృహాల్లో తరచూ తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని పాలిటెక్నిక్, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో అవగాహన శిబిరాలు నిర్వహించాలని తెలిపారు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వసతి గృహాల్లో తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడుతూ విద్యాసంస్థల్లో వారానికి మూడుసార్లు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల విముక్తి కేంద్రాన్ని తరచూ సందర్శిస్తూ అక్కడికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఈ సమావేశంలో పోలీస్, విద్య, వైద్య ఆరోగ్య, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
