- పదవీ విరమణకు ముందు అరుదైన గౌరవం.. నరసింహాచారికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్
కరీంనగర్ టౌన్, ఆగస్టు 15 (చైతన్యగళం): అగ్నిమాపక, రక్షణ సేవల్లో 33 ఏళ్లపాటు అంకితభావంతో పనిచేసిన మానకొండూర్ అగ్నిమాపక కేంద్రం లీడింగ్ ఫైర్ఫైటర్ టి. నరసింహాచారికి అరుదైన గౌరవం దక్కింది. ఆయన సుదీర్ఘ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇండిపెండెన్స్ డే–2026 సందర్భంగా ప్రెసిడెంట్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్కు ఎంపిక చేసింది.
1993 బ్యాచ్కు చెందిన నరసింహాచారి తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో అగ్నిప్రమాదాల నియంత్రణ, రక్షణ చర్యలు, అత్యవసర సేవల్లో కీలకంగా పనిచేశారు. అనేక ఫైర్, రెస్క్యూ, ఎమర్జెన్సీ కాల్స్లో పాల్గొని ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలో సేవలందించారు. విధి నిర్వహణలో నిజాయితీ, విధేయత, క్రమశిక్షణతో పాటు కష్టపడి పనిచేసే తత్వాన్ని ప్రదర్శించారు.
పదవీ విరమణకు ముందు ప్రతిష్ఠాత్మక గుర్తింపు
ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న నరసింహాచారికి ఉద్యోగ జీవితపు చివరి దశలో దేశ అత్యున్నత గౌరవాల్లో ఒకటైన రాష్ట్రపతి పతకం లభించడం విశేషంగా నిలిచింది. 33 ఏళ్ల సుదీర్ఘ సేవకు లభించిన ఈ పురస్కారం ఆయన అంకితభావానికి, వృత్తి నిబద్ధతకు దక్కిన గౌరవంగా సహచరులు అభివర్ణిస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు ముందుంటారు. అలాంటి సేవల్లో నరసింహాచారి చూపిన నిబద్ధతకు రాష్ట్రపతి పతకం గుర్తింపుగా నిలిచింది. ఆయనకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించడం అగ్నిమాపక శాఖలోని సహచరులు, కుటుంబ సభ్యులు, మిత్రుల్లో ఆనందం నింపింది.
