వరంగల్, ఆగస్టు 4 (చైతన్యగళం):
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి మంగళవారం వరంగల్, హనుమకొండ ప్రధాన బస్టాండ్లు, హనుమకొండ డిపోలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులకు అందుతున్న సేవలు, డిపో నిర్వహణ, మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వరంగల్ నగర ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పీఎం ఈ- బస్ సేవా పథకం కింద మరో 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నాం. ప్రస్తుతం వరంగల్ రీజియన్లో 112 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయి” అని వెల్లడించారు.
బస్టాండ్లలో పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మహిళా ప్రయాణికుల భద్రత, వెయిటింగ్ హాళ్ల నిర్వహణ, బస్సుల సమయపాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్లు, డ్రైవర్లు, కండక్టర్లతో సమావేశమై బస్సు రూట్లు, ఆక్యుపెన్సీ నిష్పత్తి, ఉద్యోగుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు.“ఆర్టీసీపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సురక్షితమైన, నాణ్యమైన ప్రయాణాన్ని అందించడమే సంస్థ ప్రధాన ధ్యేయం. ప్రయాణికులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వాన్ని సహించం. ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి” అని ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 9 వేలకుపైగా బస్సుల ద్వారా సుమారు 60 లక్షల మంది ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రజా రవాణా సేవలను మరింత ఆధునీకరించి, ప్రయాణికులకు సురక్షితమైన, వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. రాజశేఖర్, చీఫ్ సివిల్ ఇంజినీర్ కవిత, వరంగల్ రీజినల్ మేనేజర్ భవానీ ప్రసాద్తో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
