నంద్యాల, జూలై 30 (చైతన్యగళం):
నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కళాశాలలో జిల్లా పోలీసు సిబ్బందికి ప్రత్యేక ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఐపీఎస్ సహకారంతో, రిటైర్డ్ డీజీపీ ఆదిత్య ఆర్య, ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదిత్య ఆర్య మాట్లాడుతూ, “పోలీసు విధులు అత్యంత బాధ్యతాయుతమైనవి. నిరంతర ఒత్తిడిని ఎదుర్కొనే పోలీసులకు ధ్యానం మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఉత్తమ సాధనం” అని వివరించారు.

ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం చేయడం ద్వారా నిర్ణయ సామర్థ్యం మెరుగుపడుతుందని, కోప నియంత్రణ, భావోద్వేగ సమతుల్యత పెరుగుతాయని తెలిపారు.జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా కాపాడుకోవాలని సూచించారు. ఈ శిక్షణలో నేర్చుకున్న ధ్యాన విధానాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎస్. ఖాదర్ భాష, ఎఆర్ అడిషనల్ ఎస్పీ చిన్ని కృష్ణ, ఎఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, రామకృష్ణ విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, శిక్షకులు పాల్గొన్నారు.
