మంచిర్యాల, జూలై 30 (చైతన్యగళం):
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు & భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద సూచించారు.
గురువారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటి గోడ కూలిన ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న కోటపల్లి మండలం ఆలుగాం గ్రామానికి చెందిన బాధితులు ఆత్రం లక్ష్మి, ఆత్రం అనిల్ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ. భాస్కర్ తదితర అధికారులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు, ప్రభుత్వ పరంగా పరిహారం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతోందన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలోని చెన్నూర్, క్యాతనపల్లి, చెన్నూర్ మున్సిపల్ అధికారులకు అవసరమైన ముందస్తు చర్యలపై ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజా సంరక్షణ చర్యలను మరింత వేగవంతం చేస్తున్నామని మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
