కరీంనగర్, ఆగస్టు 22 (చైతన్య గళం): పోలీసు సిబ్బంది సంక్షేమానికి నూతనంగా ఎన్నికైన జిల్లా పోలీసు సంఘం కార్యవర్గం కృషి చేయాలని కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు ఏ. సతీష్, కార్యవర్గ సభ్యులు శైలజ, ఎం.డి. అఫ్జల్ తదితరులు శనివారం కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను సీఐ శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం సంఘానికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సంఘం చొరవ చూపాలని సూచించారు ముఖ్యంగా పోలీసు సిబ్బందికి మెరుగైన వైద్య సదుపాయాలు, వారి పిల్లల విద్యకు సంబంధించిన సమస్యలు, ఇతర సంక్షేమ అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. నూతన కార్యవర్గం సిబ్బంది సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన జిల్లా పోలీసు సంఘం కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించారు.
