కరీంనగర్, ఆగస్టు 22 (చైతన్య గళం): నగునూర్ గ్రామంలోని ఎల్లమ్మ గుడి సమీపంలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న ఏడుగురిని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్లమ్మ గుడి సమీపంలో పోలీసులు దాడి నిర్వహించగా, పేకాట ఆడుతున్న ఏడుగురు పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.పంచుల సమక్షంలో విచారించగా నగునూర్ గ్రామానికి చెందిన మెతుకు సుధాకర్, అమిశెట్టి విద్యాసాగర్, నెల్లి రవీందర్, సాల్వాజీ తిరుమల్, బండారి శ్రీనివాస్, కనకట్ల సత్తయ్య, కన్నమల్ల కోటేశ్వర్గా గుర్తించారు. వారి వద్ద నుంచి పేకాటకు పందెంగా పెట్టిన రూ.7,370 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, పేకాట ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం కోర్టుకు పంపించినట్లు పోలీసులు తెలిపారు.
