కరీంనగర్, జూలై 29 (చైతన్యగళం):
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రామడుగు పోలీస్ స్టేషన్ను బుధవారం పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన, ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాధీనంలో ఉన్న వాహనాల వివరాలు తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన విధులపై ప్రశ్నించారు. రికార్డులను సరైన పద్ధతిలో నిర్వహించి, నమోదైన కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్లో పొందుపరచాలని ఆదేశించారు.
తెలంగాణ పోలీసులు టెక్నాలజీ వినియోగంలో భాగంగా అందుబాటులోకి తెచ్చిన సీసీటీఎన్ఎస్–2.0, పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ-సమన్లు, టీఎస్-కాప్ హెచ్ఆర్ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ సాఫ్ట్వేర్, సీడీఆర్ వంటి అన్ని అప్లికేషన్లపై పూర్తి స్థాయి పట్టు సాధించి, వాటిని రోజువారీ విధుల్లో విస్తృతంగా వినియోగించాలని సూచించారు.
బ్లూ కోల్ట్స్ సిబ్బంది వినియోగిస్తున్న పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ తనిఖీ చేసి, ఎఫ్ఐఆర్ ఇండెక్స్ను పరిశీలించారు. పెండింగ్ కేసులపై సమీక్ష జరిపి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, విజిబుల్ పోలీసింగ్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను సెక్టార్లు, సబ్సెక్టార్లుగా విభజించి గ్రామ పోలీస్ అధికారులను కేటాయించాలని స్పష్టం చేశారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించి, ప్రతి నెల కొత్త సమాచారాన్ని నమోదు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, రామడుగు ఎస్సై రాజుతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
