నిజామాబాద్, జూలై 27 (చైతన్యగళం):
నగరంలోని పలు రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిను కోరారు. సోమవారం హైదరాబాదులోని సచివాలయంలో ఆయనను కలిసి ప్రతిపాదనలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “నగరంలోని దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్, నాందేవాడ వంతెన ఆర్వోబీ పొడిగింపు పనులు అత్యవసరం. ప్రస్తుతం విజయ థియేటర్, నాందేవాడ వంతెన వద్ద మాత్రమే రైల్వే లైన్ దాటే మార్గాలు ఉన్నాయి. సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఎల్లమ్మగుట్ట వద్ద కొత్త రైల్వే రన్వే ఏర్పాటు చేయడం అత్యంత అవసరం” అని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.170 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే నిజామాబాద్ రేడియో స్టేషన్ నుంచి ముదక్పల్లి పాత జిపి ఆఫీస్ వరకు రూ.30 కోట్లతో ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించారు. వర్ని జంక్షన్ నుంచి నిజామాబాద్–డిచ్పల్లి–ఇందల్వాయి–భీమ్గల్ మీదుగా కమ్మర్పల్లి వరకు 107 కిలోమీటర్ల పొడవుతో కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు అందజేశారు.
