నల్లగొండ, జూలై 18 (చైతన్యగళం):
తెలంగాణ ఐకెపి వివోఏ ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 18 వేల వేతన హామీతో పాటు ఇతర వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం ఐకెపి వివోఏల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. ఈ సందర్భంగా ఎండి సలీం మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 18 వేల కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ అమలు చేయలేదు. చాలీచాలని వేతనాలతో వివోఏలు అర్ధాకలతో పనిచేయాల్సి వస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.వివోఏలకు సంబంధంలేని బుధవారం రివ్యూ మీటింగ్స్, ఉల్లాస్ యాప్లో పని, ఆన్లైన్ పనులను ఆపాలని, ప్రమాద బీమా రూ.10 లక్షలు, టాప్స్ నెట్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.జిల్లా గౌరవ అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం సాధించిన చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చి దోపిడీకి అవకాశం కల్పించింది. వెంటనే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కోడ్స్ అమలు చేయబోమని ప్రకటించాలి” అని డిమాండ్ చేశారు.యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చిలుముల దుర్గయ్య, పి. సులోచన మాట్లాడుతూ, “వివోఏల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 27న కలెక్టరేట్ ముట్టడి అనంతరం సమరశీల పోరాటాలకు సిద్ధమవుతాం” అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి పెంజర్ల సైదులు, జిల్లా నాయకులు పోలె సత్యనారాయణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. వెంకన్న, యూనియన్ నాయకులు కె. రేణుక, బి. సురేష్, కే. చంద్రకళ, రాందాస్, వై. పాపయ్య, వల్లెపు రాజేశ్వరి, జిల్లపల్లి మంగ, కాసర్ల సువర్ణ, జటావత్ సరోజ, బుర్రి రేణుక, పద్మ, ఆర్.బి. నాయక్, ధనలక్ష్మి, సుజాత, రాజు, సైదులు, సైదమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
