సిద్దిపేట, జూలై 16 (చైతన్య గళం):
సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులోని జిల్లా మహిళా సమాఖ్య భవనంలో జిల్లా సెర్ప్, ఎస్ఆర్డీఎస్ సిబ్బందికి ఎరిక్సన్ ఇన్సూరెన్స్ టీపీఏ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సెర్ప్, ఎస్ఆర్డీఎస్ సిబ్బంది ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని సూచించారు. వరి కొనుగోలు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీ, ఉపాధి హామీ పథకం తదితర కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేయడం వల్ల సిబ్బంది తీవ్ర పని ఒత్తిడికి గురవుతారని, అందువల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు.

ఈ వైద్య శిబిరంలో అన్ని ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తారని, దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు వైద్యులు సూచించిన అదనపు పరీక్షలు కూడా చేయించుకోవాలని సూచించారు. వైద్యులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని తెలిపారు.
రోజూ కనీసం గంటసేపు వ్యాయామం చేయడం, ఉదయం వాకింగ్ చేయడం, పోషకాహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం వంటి మంచి ఆరోగ్య అలవాట్లను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ ఆర్య, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక తదితరులు పాల్గొన్నారు.
