జగిత్యాల, జూలై 10 (చైతన్యగళం): జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మొక్కజొన్న రైతుల వినతి మేరకు సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను గ్రామ సహకార సంఘం సభ్యులు కలిసి ధన్యవాదాలు తెలిపారు. రైతుల సమస్యలకు తక్షణ స్పందనతో అండగా నిలిచిన ఆయన కృషి వల్ల రికార్డు స్థాయిలో మొక్కజొన్న పంట కొనుగోలు జరిగి, రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడం రైతులకు ఊరటనిచ్చిందని సభ్యులు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం 9 రోజుల్లోనే 9వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేసిందని, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలను తీసుకువచ్చి వ్యవసాయంలో నూతన సాంకేతికతపై అవగాహన కల్పించడం ద్వారా రైతులకు మేలు జరిగిందని తెలిపారు. జిల్లావారీగా ఉత్తమ రైతులను గుర్తించి ప్రభుత్వం సత్కరించిందని, సన్న వడ్ల సాగుకు రైతులు ముందుకు రావాలని, ఎల్ నినో ప్రభావంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతుల పక్షాన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాటిపెళ్ళి గంగారెడ్డి, AMC చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ గర్వందుల చిన్న గంగయ్య, మాజీ ఆత్మ చైర్మన్ ఏలేటి రాజిరెడ్డి, మాజీ AMC డైరెక్టర్ పూరిపాటి రాజిరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
