సిద్దిపేట, ఆగస్టు 1 (చైతన్యగళం):
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు పారదర్శకంగా, సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి ఆదేశించారు. శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, విద్య, వైద్యం, రైతు సంక్షేమం, ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్యశాఖ, గ్రామీణాభివృద్ధి, పునరుత్పాదక ఇంధనం, మౌలిక వసతుల కల్పన, భూగర్భ జలాల పెంపు, గృహ నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, మహిళా సాధికారత, మానవ వనరుల అభివృద్ధి వంటి రంగాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని సూచించారు.

పేద ప్రజల అభ్యున్నతే ప్రభుత్వాల లక్ష్యమని, ఆ లక్ష్య సాధనలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. అమలులో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
