కరీంనగర్, జూలై 2 (చైతన్యగళం):
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రాజ రాజేశ్వర డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న విగ్రహం వద్ద గురువారం రాజ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆచార్య గడ్డం రామ్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
సంఘం జిల్లా కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి నేతృత్వంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. “రామ్ రెడ్డి అమర్ రహే – వారి ఆశయాలను కొనసాగిద్దాం” అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, “ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆపేసిన వారికి విద్య కొనసాగించే అవకాశం కల్పించేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని స్థాపించడం రామ్ రెడ్డి చేసిన మహత్తర కృషి. ఉన్నత విద్యను అందరికీ చేరువ చేసిన ఆయన సేవలు మరువలేనివి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కేశవ్ రెడ్డి, అంజనా రెడ్డి, సంధి తిరుపతి రెడ్డి, అంబేద్కర్ రీజనల్ కోఆర్డినేటర్ ఎం. సత్య ప్రకాష్, శ్రీవాస్ రెడ్డి, జాలి శ్రీనివాస్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
