మంచాల, జూలై 1 (చైతన్యగళం): మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో గత మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బుధవారం మండల కేంద్రంలో ఎజుకేట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభా పారితోషికాలు అందజేశారు.
గత పదేళ్లుగా పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రతిభా పురస్కారాలు అందిస్తున్న తాళ్లపల్లిగూడకు చెందిన విద్యావేత్త డా. ఎస్.కే. బిక్షపతి ఈసారి ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు నోట్బుక్స్, డ్రెస్సులు, చేతి గడియారాలు తదితర ప్రోత్సాహకాలను అందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల అభివృద్ధి అధికారి శ్రీమతి వసంత లక్ష్మి మాట్లాడుతూ, “దాతలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్యలో ముందుకు సాగాలి” అని సూచించారు.
మండలంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన తాళ్లపల్లిగూడ, లింగంపల్లి, చెన్నారెడ్డిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రాందాసు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
