మెదక్, జూన్ 10 (చైతన్యగళం): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారం, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డీఈఓకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర ఖేల్ కో కన్వీనర్ బండారి ప్రశాంత్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ రేటు తగ్గిపోతున్నదని పేర్కొంటూ, పాఠశాలలను పటిష్ఠపరచి అవసరమైన వసతులు కల్పించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి, యూనిఫాంలు, బస్ ఫీజులు, స్పెషల్ ఫీజులు, పుస్తకాల ఫీజులు, బ్రాండ్ల పేర్లతో వేల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై అధిక ఆర్థిక భారం మోపుతున్నాయని విమర్శించారు. ఎల్కేజీ నుంచి ఉన్నత తరగతుల వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు.ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై ప్రభుత్వం కఠిన నియంత్రణ చర్యలు తీసుకుని, విద్యాశాఖ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వంశీ, సంతోష్, చంద్రశేఖర్, నవీన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి – ఏబీవీపీ
0
9
