ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధికా భూపతి రాజ్ సూచన
మెదక్, జూన్ 10 (చైతన్యగళం): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మెదక్ పట్టణంలోని పలు వార్డుల్లో బుధవారం వార్డు సభలు నిర్వహించబడ్డాయి. 06, 14, 15, 19, 23, 27, 29, 32వ వార్డులలో జరిగిన ఈ సభలకు సంబంధిత వార్డు కౌన్సిలర్లు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధికా భూపతి రాజ్ మాట్లాడుతూ, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా, భూగర్భ జలాలను పెంపొందించేందుకు ఇది అత్యంత అవసరమని పేర్కొన్నారు.
అలాగే ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, మురికికాలువల శుభ్రత, పూడిక తీయడం, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలు, వీధి దీపాల నిర్వహణ, మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ, వరదల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజలు తమ వార్డులలో ఉన్న సమస్యలను సభలో వివరించగా, వాటిని పరిష్కరించేందుకు మున్సిపాలిటీ కృషి చేస్తుందని అధికారులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ నవీన్, సంబంధిత వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
