పనులు త్వరగా పూర్తి చేయాలి.. అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం
హుస్నాబాద్, ఆగస్టు 25 (చైతన్యగళం): సైదాపూర్ మండలం సర్వాయిపేటలో అభివృద్ధి చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పర్యాటక ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు ‘పల్లె పల్లెకు పొన్నం అన్న.. పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా సర్వాయిపేటలో పర్యటించిన మంత్రి ప్రాజెక్టు పనులను పరిశీలించారు పర్యాటక ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ పనులను పరిశీలించి, విగ్రహ ఏర్పాటు, పరిసరాల అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను త్వరగా పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పర్యాటక ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. ఆ హామీ మేరకు ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు మ్యూజియం నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు. మ్యూజియం భవనం ముందు ఫ్లోరింగ్, గార్డెనింగ్, సుందరీకరణ పనులను పూర్తి చేసి సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు పరిచయం చేసేలా పర్యాటక ప్రాజెక్టును అన్ని హంగులతో తీర్చిదిద్దాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
