- ఎస్సీ కాలనీలో తాగునీటి ఎద్దడికి పరిష్కారం
పాములపాడు, ఆగస్టు 18 (చైతన్యగళం): పాములపాడు మండలం మిట్టకందల గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సహకారంతో నూతన బోరు ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ జి.హరిప్రసాద్ యాదవ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొందన్నారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయసూర్య దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. స్పందించిన ఎమ్మెల్యే నూతన బోరు ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభించినట్లు వివరించారు.
నూతన బోరు అందుబాటులోకి రావడంతో కాలనీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హరిప్రసాద్ యాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీను, కార్యకర్తలు బుడ్డన్న, వెంకటయ్య, ప్రభాకర్, నియాజ్, మధు తదితరులు పాల్గొన్నారు.
