- 15 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు సర్వేలో గుర్తింపు.. హద్దులు ఏర్పాటు చేసినా కొనసాగుతున్నాయంటున్న గ్రామస్తులు
కోహెడ, సెప్టెంబర్ 20 (చైతన్యగళం): మండలంలోని తీగలకుంటపల్లి శివారులోని పెరుగు రాజన్న కుంట భూముల పరిరక్షణపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 369లో మొత్తం 29 ఎకరాల కుంట భూమి ఉండగా.. సుమారు 15 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు సంయుక్త సర్వేలో గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు.

కుంట భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసి రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఇరు శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి సుమారు మూడు నెలల క్రితం కుంట భూములకు హద్దులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అయితే హద్దులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనూ కొందరు నిర్మాణాలు, ఇతర కార్యకలాపాలకు ప్రయత్నిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత శాఖల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కుంట భూముల స్థితిగతులపై సమగ్ర పరిశీలన చేపట్టి, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
