- 17 మండలాల్లో 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 జూనియర్ కళాశాలల్లో 49,025 మంది విద్యార్థులకు అల్పాహారం
కరీంనగర్, సెప్టెంబరు 14 (చైతన్యగళం): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పాఠశాల అల్పాహార కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సమీకృత సామూహిక వంటశాలను త్వరలో ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి హరేకృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
పాఠశాల అల్పాహార కార్యక్రమాన్ని ప్రభుత్వం తొలుత కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. దీనికి విశేష స్పందన రావడంతో మధిర, మంథని, మంచిర్యాల ప్రాంతాల్లోనూ సమీకృత సామూహిక వంటశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించడంలో భాగంగా కరీంనగర్లోనూ వంటశాలను సిద్ధం చేశారు.
కరీంనగర్ వంటశాల ద్వారా కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ తదితర నియోజకవర్గాల్లోని 17 మండలాల పరిధిలో 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 49,025 మంది విద్యార్థులకు ప్రతిరోజూ రుచికరమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నారు.
వారానికి ఆరు రకాల అల్పాహారం
విద్యార్థులకు సమతుల్య, పోషకాహారం అందించేందుకు జాతీయ పోషకాహార సంస్థ సహకారంతో మెనూను రూపొందించారు. సోమవారం ఇడ్లీ–సాంబారు, మంగళవారం పూరీ–ఆలూ కుర్మా, బుధవారం దోశ–చట్నీ, గురువారం ఉప్మా–చట్నీ, శుక్రవారం చిరుధాన్యాల ఇడ్లీ–సాంబారు, శనివారం బోండా–చట్నీ అందించనున్నారు. ప్రతిరోజూ అల్పాహారంలో మార్పు ఉండేలా మెనూను రూపొందించారు. విద్యార్థులకు రోజు విడిచి రోజు పాలు కూడా అందిస్తారు.
ఉదయం పూట పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, ఏకాగ్రత, పాఠశాల హాజరు మెరుగుపడేలా కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. విద్యార్థులు ఆకలితో పాఠశాలకు రాకుండా, ఆరోగ్యకరమైన అల్పాహారంతో ఉత్సాహంగా చదువుపై దృష్టి సారించేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
