- విద్యార్థుల చేతుల్లో రూపుదిద్దుకున్న వినాయక విగ్రహాలు
- పర్యావరణహిత విగ్రహాలనే పూజించాలి: ప్రధానోపాధ్యాయుడు లవన్కుమార్
రామడుగు, సెప్టెంబర్ 13 (చైతన్యగళం): మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని కొరటపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లవన్కుమార్ అన్నారు. పాఠశాల విద్యార్థులు స్వయంగా తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను పాఠశాల ఆవరణలో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా లవన్కుమార్ మాట్లాడుతూ మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలు పర్యావరణానికి మేలు చేస్తాయని తెలిపారు. రసాయనిక రంగులు, ఇతర పదార్థాలతో తయారైన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, అందువల్ల పర్యావరణహిత మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
విద్యార్థులు స్వయంగా మట్టి విగ్రహాలను తయారు చేయడం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా వారిలో సృజనాత్మకతతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయుడు ఆంజనేయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
