CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 1:38 pm Posted by : rakeshkashaveni12@gmail.com

భూ భారతి అమలుపై కలెక్టర్ సమీక్ష

సిద్దిపేట, ఆగస్టు 27 (చైతన్య గళం):

భూ భారతి రీ సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్‌తో కలిసి ఆర్డీవోలు, తహసీల్దార్లతో జూమ్ సమావేశం నిర్వహించారు భూ భారతి చట్టం అమలులో రీ సర్వే అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాల్లో సర్వే అధికారులు, తహసీల్దార్లు సమన్వయంతో పనిచేసి గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, సాధాబైనామా దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి ఎలాంటి తప్పిదాలు లేకుండా చూడాలని ఆదేశించారు 22(ఏ)కు సంబంధించిన వార్తా కథనాలపై మండలాల వారీగా వివరణలు పంపాలని తహసీల్దార్లను, వార్తా కథనాలను పర్యవేక్షించి నివేదికలు సమర్పించాలని ఆర్డీవోలను ఆదేశించారు. 22(ఏ)లోని వ్యవసాయేతర భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆర్డీవోలు పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం నివేదికలను కలెక్టరేట్‌కు పంపాలని సూచించారు దేవాదుల ప్రాజెక్టు తాపస్‌పల్లి రిజర్వాయర్‌కు సంబంధించి కొమురవెల్లి, కొండపాక, కుకునూర్‌పల్లి, చేర్యాల, మద్దూరు, దౌల్తాబాద్ తదితర మండలాల్లో కాలువల భూసేకరణను గ్రామాల వారీగా సర్వే చేసి అంచనాలు రూపొందించి అవార్డులు జారీ చేయాలని ఆదేశించారు గౌరవెల్లి రిజర్వాయర్ పరిధిలోని అక్కన్నపేట, కోహెడ మండలాల్లో కాలువల భూసేకరణకు నిధులు విడుదలైనందున రైతులను పిలిపించి నష్టపరిహారం అందించాలని, మిగిలిన భూసేకరణ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.