CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 1:42 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ఇచ్చిన మాటకు కట్టుబడి – ఆడబిడ్డకు అండగా రవీందర్‌సింగ్

కరీంనగర్ , ఆగస్టు 26 (చైతన్యగళం):

ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తున్న 58వ డివిజన్ కార్పొరేటర్, మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్‌సింగ్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. 58వ డివిజన్‌కు చెందిన దుర్శెట్టి ప్రసూన–మహేంద్ర చారి దంపతుల కుమార్తె అనుశ్రీ–శ్రీనివాస చారి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వివాహానికి ముందే ఆడబిడ్డకు రూ.25 వేల ఆర్థిక సహాయంతో పాటు పట్టుచీరను కానుకగా అందజేశారు. అనంతరం వివాహ వేడుకకు స్వయంగా హాజరై కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. వధూవరుల దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా రవీందర్‌సింగ్ మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకం, వేసిన ప్రతి ఓటు తనపై ఉన్న బాధ్యతకు గుర్తు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రజాప్రతినిధి కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రజల కష్టాల్లోనే కాకుండా వారి సంతోషాల్లోనూ భాగస్వామ్యం కావడమే నిజమైన ప్రజాసేవ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు తనపై ప్రజలు ఉంచిన విశ్వాసంతో వరుసగా ఆరు సార్లు కార్పొరేటర్‌గా గెలిపించారని గుర్తుచేసిన ఆయన.. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీ మేరకు వివాహానికి ముందే ఆర్థిక సహాయం అందించి, శుభకార్యానికి స్వయంగా హాజరై ఆశీర్వదించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల కుటుంబాల్లో జరిగే శుభకార్యాల్లోనూ కుటుంబ సభ్యుడిలా పాల్గొనడం ఆయనకు ప్రజలతో ఉన్న ఆత్మీయ అనుబంధానికి నిదర్శనమని పేర్కొన్నారు.