Tuesday, August 18, 2026
Homeతెలంగాణసావర్కర్‌పై ప్రశ్న అడిగిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌ అన్యాయం

సావర్కర్‌పై ప్రశ్న అడిగిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌ అన్యాయం

📰 Generate e-Paper Clip

  • గురు ప్రసాద్‌ సస్పెన్షన్‌ను తక్షణమే ఉపసంహరించాలి: తపస్‌

కరీంనగర్‌, ఆగస్టు 18 (చైతన్యగళం): కేరళ రాష్ట్రంలోని కాసర్‌గోడ్‌ జిల్లా కుంబ్లా సబ్‌ డిస్ట్రిక్ట్‌లో నిర్వహించిన పాఠశాల స్థాయి సోషల్‌ సైన్స్‌ ఫ్రీడమ్‌ క్విజ్‌లో స్వాతంత్ర్య వీర్‌ వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌కు సంబంధించిన ప్రశ్న అడిగినందుకు ఉపాధ్యాయుడు గురు ప్రసాద్‌ను సస్పెండ్‌ చేయడం అన్యాయమని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) పేర్కొంది. ఆయన సస్పెన్షన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది.

ఈ మేరకు తపస్‌ కరీంనగర్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తపస్‌ నాయకులు మాట్లాడుతూ సావర్కర్‌పై ప్రశ్న అడిగినందుకు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గంలో ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

స్వాతంత్ర్య వీర్‌ వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తిత్వమని తపస్‌ నాయకులు పేర్కొన్నారు. ఆయన విప్లవ జీవితం, బ్రిటిష్‌ ప్రభుత్వం విధించిన శిక్షలు, అండమాన్‌ సెల్యులర్‌ జైలులో ఆయన కారాగారవాసం వంటి అంశాలు చారిత్రక అధ్యయనంలో భాగమని తెలిపారు. సావర్కర్‌ ఆలోచనలతో ఏకీభవించవచ్చు లేదా విభేదించవచ్చని, అయితే ఆయనపై ప్రశ్న అడగడాన్ని నేరంగా లేదా క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించడం సరికాదని అన్నారు.

ప్రశ్నలో వాస్తవిక లేదా భాషాపరమైన లోపాలు ఉంటే వాటిని సరిచేసే అవకాశం ఉందని, అందుకు ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేయడం తగిన చర్య కాదని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాన్ని సంబంధిత సబ్‌ డిస్ట్రిక్ట్‌ విద్యాధికారి ఆమోదించిన అనంతరమే పాఠశాలలకు పంపిణీ చేశారని, ఏదైనా పొరపాటు జరిగితే కేవలం ప్రశ్నలను రూపొందించిన ఉపాధ్యాయుడినే బాధ్యుడిని చేయడం సముచితం కాదని తెలిపారు.

విచారణకు ముందే కఠిన చర్యలొద్దు

ఏదైనా వాస్తవిక లోపం ఉంటే దానిని సరిదిద్దడంతో పాటు సంబంధిత ఉపాధ్యాయుడు, అధికారుల నుంచి వివరణ తీసుకోవచ్చని తపస్‌ నాయకులు అన్నారు. విచారణ పూర్తికాకముందే సస్పెన్షన్‌ వంటి కఠిన చర్యలు తీసుకోవడం ఉపాధ్యాయుల్లో భయం, స్వీయ సెన్సార్‌షిప్‌ వాతావరణానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

పోర్ట్‌ బ్లెయిర్‌ విమానాశ్రయానికి వీర్‌ సావర్కర్‌ పేరు పెట్టడం, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆయన గౌరవార్థం పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేయడం, పార్లమెంట్‌ భవనంలో ఆయన చిత్రపటం ఏర్పాటు చేయడం వంటి అంశాలను తపస్‌ నాయకులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గురు ప్రసాద్‌ సస్పెన్షన్‌ను తక్షణమే, బేషరతుగా ఉపసంహరించుకుని ఆయనను గౌరవప్రదంగా విధుల్లోకి తీసుకోవాలని కేరళ ప్రభుత్వాన్ని కోరారు.

ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, ఉపాధ్యాయుల విద్యా స్వాతంత్ర్యం, భావప్రకటన స్వేచ్ఛ, గౌరవాన్ని పరిరక్షించాలని తపస్‌ డిమాండ్‌ చేసింది.

కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అన్నమనేని తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి జారతి నర్సయ్య, జిల్లా మీడియా ఇన్‌చార్జి బొద్దుల సత్యనారాయణ, కరీంనగర్‌ గ్రామీణ మండల అధ్యక్షుడు బుర్ర నాగరాజు, ప్రధాన కార్యదర్శి చేరాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!