కల్వకుర్తి, ఆగస్టు 18 (చైతన్యగళం): బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కల్వకుర్తి ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన అభిమానులు, పలువురు నాయకులు కొనియాడారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలో ఎడ్మ కిష్టారెడ్డి 6వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ఆర్ కాంప్లెక్స్, పాలమూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎడ్మ కిష్టారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
కల్వకుర్తి నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఎడ్మ కిష్టారెడ్డి ప్రజా సంక్షేమం, ప్రాంత అభివృద్ధి, పేదలు, బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారని గుర్తుచేశారు.
రైతుల సమస్యల పరిష్కారం కోసం చేసిన పోరాటాల కారణంగా ఆయనను ప్రజలు ఆప్యాయంగా **‘కరెంటు కిష్టన్న’**గా పిలుచుకునేవారని తెలిపారు. అనేక ప్రజా సమస్యలపై ఉద్యమాలు నిర్వహించి కల్వకుర్తి ప్రాంత అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు.
కల్వకుర్తిలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు కోసం ఎడ్మ కిష్టారెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆర్డీఓ కార్యాలయం సాధించడంలో ఆయన పోరాటం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. కల్వకుర్తి ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన ఎడ్మ కిష్టారెడ్డి సేవలు చిరస్మరణీయమని అన్నారు.
వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఎడ్మ కిష్టారెడ్డికి ఘన నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సేవలో ముందుకు సాగాలని పలువురు పిలుపునిచ్చారు.
