- అనుమానాస్పద లింకులు, మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్, ఆగస్టు 18 (చైతన్యగళం): ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్, కరీంనగర్లో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు సైబర్ మోసాలపై అవగాహన కల్పించేలా పలు స్కిట్లను ప్రదర్శించారు.
కేవైసీ అప్డేట్, విద్యుత్ బిల్లు తదితర పేర్లతో వచ్చే అనుమానాస్పద మెసేజ్లు, లింకులను నమ్మవద్దని అధికారులు సూచించారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయడం, అనుమానాస్పద యాప్లను డౌన్లోడ్ చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్లు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు. సకాలంలో ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
రాష్ట్రస్థాయి సైబర్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఐసీసీసీ సెంటర్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రశంసాపత్రాలు అందుకున్న విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి. వరలక్ష్మి అభినందించారు. సైబర్ నేరాలపై విద్యార్థినులు అవగాహన పెంచుకోవడంతో పాటు ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు.కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
