ఆమనగల్, ఆగస్టు 18 (చైతన్యగళం): ఆమనగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
కళాశాల ప్రధానాచార్యులు ప్రొఫెసర్ శ్రీపాద శార్వాణి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆమనగల్ మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు మాధవరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు వారి చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర వికాసంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, సమష్టి భావన పెంపొందుతాయని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
