- అదనపు డీసీపీ పి. వెంకట రమణను అభినందించిన సీపీ గౌష్ ఆలం
కరీంనగర్, ఆగస్టు 15 (చైతన్యగళం): రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్కు ఎంపికైన కరీంనగర్ కమిషనరేట్ అదనపు డీసీపీ (అడ్మిన్) పి. వెంకట రమణకు ఘన సన్మానం లభించింది. శనివారం పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆయనను ఘనంగా సన్మానించి అభినందించారు.
పోలీస్ శాఖలో సుదీర్ఘకాలంగా అంకితభావంతో, సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ విశిష్ట సేవలు అందించినందుకు పి. వెంకట రమణకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ లభించడం కరీంనగర్ కమిషనరేట్కు గర్వకారణమని సీపీ గౌష్ ఆలం పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, సేవా స్ఫూర్తి ఇతర పోలీసు అధికారులకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం ఆయన సేవలకు లభించిన సముచిత గుర్తింపుగా అభివర్ణించిన సీపీ, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసేలా సేవలు కొనసాగించాలని సూచించారు.
ఈ సందర్భంగా కమిషనరేట్ అధికారులు, సిబ్బంది అదనపు డీసీపీ పి. వెంకట రమణకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయనకు లభించిన రాష్ట్రపతి పోలీస్ మెడల్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సిబ్బందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
