CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 10:41 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కరీంనగర్ లో తాంత్రిక పూజల కలకలం

  • క్షుద్ర పూజలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు?
  • రాత్రివేళ అనుమానాస్పద కార్యకలాపాలపై 112కు సమాచారం.. స్పందన లేదంటున్న స్థానికులు

కరీంనగర్ టౌన్, ఆగస్టు 11 (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని మారుతినగర్ 36వ డివిజన్ పరిధిలో రాత్రివేళ అనుమానాస్పదంగా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భయాందోళనకు గురైన కొందరు స్థానికులు అత్యవసర సహాయక నంబర్ 112కు ఫోన్ చేసి మూడో పట్టణ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.

రాత్రి సమయంలో వరుసగా ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, తమ ఫిర్యాదుపై తగిన స్పందన లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందినప్పుడు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించాల్సి ఉన్నప్పటికీ, స్పందన లేకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

“రాత్రివేళల్లో ఇలాంటి అనుమానాస్పద పూజలు జరుగుతున్నట్లు కనిపించడంతో భయాందోళనకు గురయ్యాం. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది” అని స్థానికులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, సంబంధిత ప్రాంతంలో సమగ్రంగా తనిఖీలు నిర్వహించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలని 36వ డివిజన్ ప్రజలు కోరుతున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందినప్పుడు వెంటనే స్పందించి, స్థానికులకు భద్రతా భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.