CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 8:48 pm Posted by : CHAITHANYA GALAM NEWS

తెలంగాణలో ముగిసిన సర్ ప్రక్రియ

తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. తెలంగాణలో 73,95,954 మంది ఓటర్లను తొలగించినట్లు సమాచారం.

హైదరాబాద్: తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. తెలంగాణలో 73,95,954 మంది ఓటర్లను తొలగించినట్లు సమాచారం. ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 78.14 శాతం డిజిటలైజేషన్ నమోదైంది.

అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 94.30 శాతం డిజిటలైజేషన్ పూర్తయ్యింది. ఆ తర్వాతి స్థానాల్లో మెదక్ 90.54 శాతం, సూర్యాపేట 90.43 శాతంతో ఉన్నాయి. ఇక, హైదరాబాద్ 27,74,687 ఎన్యూమరేషన్ ఫారాలతో 58.58 శాతం డిజిటలైజేషన్‌ పూర్తై చివరి స్థానంలో నిలిచింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 63.82 శాతం, రంగారెడ్డి జిల్లాలో 64.91 శాతం, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 89.45 శాతం, జగిత్యాల జిల్లాలో 89.60 శాతం డిజిటలైజేషన్ పూర్తయ్యింది. రెండు సార్లు గడువు పొడిగించినప్పటికీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో డిజిటలైజేషన్ శాతం పెరగలేదు.

 

 

కాగా, తెలంగాణలో సర్ ప్రక్రియ పూర్తయినట్లు ఈనెల 12న సీఈవో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానున్నట్లు సమాచారం. ఆ తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ కొనసాగనుంది. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది.